బతుకంతా నీ కోసం.. పరితపిస్తూ జీవించా.. ఎదురు చూపులు చూస్తూ.. ఎందరినో ప్రేమించా..

Friday, March 11, 2011

జాషువా


ఇచ్చోటనే కదా ! 
నీ చక్కని  విగ్రహం
ముక్కలై పోయింది
నీ విగ్రహమే కాదు 
కారల్ మార్క్స్  బొమ్మని కూల గొట్టి 
కాలు పెట్టిన వాడి కాళ్ళకు 
అమెరికా నమస్కరించినట్టుంది 
గబ్బిలాన్ని పట్టుకుని  రెక్కలు విరిచి 
ముక్కలు చేసినట్టుంది 
నువ్వు వినుకొండలో ఉండకుండా 
ట్యాంకు బండు దాకా ఎందుకొచ్చావు?
రోమ్ లాంటి నగరం
తగల బడటానికే తప్ప
తల దాచుకోవటానికి కాదు 
నగరం లో రాతి విగ్రహమై 
'నవయుగ కవి చక్రవర్తి' వై   
సగర్వంగా జీవిస్తున్నావనుకున్నాను
దిక్కులేకుండా దీనంగా 
దెబ్బతింటావనుకోలేదు  
నీ 'ఫిరదౌసి' బతికుంటే 
కంట నీరు పెట్టుకుని 
మసీదు గోడల మీద కాదు 
ఉస్మానియా విశ్వ విద్యాలయ  కుడ్యాల మీద 
విషాద పద్యాలు రాసి ఉండేవాడు 
నిన్ను కూల గొట్టిన కులీను డెవడో
కుల హీనుడెవడో   
తెలిసినవాడే 
తెలుగు వాడే అయ్యుంటాడు 
ప్రజల నాల్కల మీద 
పట్టం కట్టుకున్న పాదుషా!
అభిమానుల గుండెల్లో 
ఆకాశమంత పద్యమై నిలిచిన
నీ అక్షర రూపాన్ని ఎవడు కూలగొట్ట గలడు?
వంద గొంతులు పిసికి 
వందన సమర్పణ చేసే వాడెవడో   
నీ మీద చెయ్యి చేసుకుని ఉంటాడు 
వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యపు 
ఏకైక    దళిత ప్రతినిధివైన నీ మీద 
దానయ్య ఎవడో దాడి చేసి ఉంటాడు 
వీళ్ళేం చేస్తున్నారో 
వీళ్ళకు తెలియదు కనక 
విశ్వ నరుడా !
వీళ్ళను క్షమించు 
రాలింది రాతి ముక్క మాత్రమే 
బాధ పడకు జాషువా !
బంగారు విగ్రహం పెట్టే రోజొస్తుంది. 


  - ఎండ్లూరి సుధాకర్
(10.3.2011 నాడు,  హైదరాబాదు ట్యాంకు బండు మీద  'కవికోకిల గుర్రం జాషువా' విగ్రహం కూలగొట్టిన 
నేపధ్యం లో ...)













6 comments:

Ananth said...

I had a question why andhra people watch telugu serials even there is no story nothing. yesterday i got answer .. with that experience only all andhra people reacting over.. some people are not eating ... some are not not sleeping.. some are not walking .. no talking.... just bacause of some stones.. i don't know why these people did not say this dialogues when polices were attacked on OU Students.. when 600 people are suicide for telangana .. i can understand this one because those are telangana people. but i did not understand what happen after in sompatea police fire..

తెలుగు said...

హుస్సేన్సాగర్ మీది విగ్రహాలు మీవి, అందులే తేలే శవాలన్నీ మావా? అన్న కవి ప్రశ్న ఉదయించి పదేండ్లు అయ్యింది. మరి ఆ వాక్కు వట్టిగనే పొతదా?మహనీయుల విగ్రహాల మీద ఎవలకు రెండో రకం అభిప్రాయం లేదు. అవి పెట్టిచిన వాళ్ళ మీదనే మంట. ఇది సమైక్య రాష్ట్రమే అయితే హుస్సేన్సాగర్ కట్ట మీద మూడో నాలుగో విగ్రహాలు తెలంగాణ మహానీయులయి ఎందుకుంటాయి? తక్కిన ఇరువై ముప్పై అంద్రాయి ఎందుకుంటాయి. మాకు బందగి,ఇలమ్మ షోయబుల్ల ఖాన్, తుర్రెబాజ్ ఖాన్ బద్దం ఎల్ల రెడ్డి, వట్టికోట ఆళ్వారు స్వామి, దాశరథి, పాల్కురికి సోమన్న, కాలోజి, కొమురం భీమ్ ఇంకా ఎందరో ఉన్నారు వాళ్ళ విగ్రహాలు ఎక్కడ పెట్టరు. పోనీ ఆంద్ర ప్రాంతం లో ఎక్కడన్నా తెలంగాణ విగ్రహాలు ఉన్నాయా? విశాఖ బీచ్ దగ్గర ఉన్న విగ్రహాలలో ఒక్కటైనా ఉన్నదా? అగో అందుకే ఎక్కన్నో కాల్సుక వస్తది. కోపం రేశం వస్తది. విగ్రహ ఆగ్రహం వస్తది. నిజానికి తెలంగాణ ప్రజలకు ఎంత వోపిక ఉన్నదంటే తమ తమ పట్టణాల్లో ఉన్న తెలంగాణ వ్యతిరేకుల విగ్రహాలను ఇంకా ముట్టుకుంట లేరు.

తెలుగు said...

జై తెలంగాణ
జై ఆంధ్ర
జై హింద్

సుజాత said...

నా వంతు గా కన్నీటి చుక్కలు
కడివెడు...!

సత్యప్రసాద్ అరిపిరాల said...

అందుకేనేమో రాతివిగ్రహాలందు జీవించేది రాజులే కాని కవులు కాదని అని ఎప్పుడో చెప్పాశాడీ మహాకవి.. ప్రజలనాల్కపైన జీవించేవాడిని ఎవరు నాశనం చెయ్యగలరు చెప్పండి.. విగ్రహం కోల్పోయినందుకు కన్నా నిగ్రహం కోల్పోయిన వారిగురించి, ఉత్సవిగ్రహాలలా మిగిలిపోయిన ప్రభుత్వాన్ని గురించి ఎక్కువ చింతించాల్సిన సమయం.. చేసిన తప్పును కనీసం గుర్తించి క్షమించమని అనలేని రాక్షసజాతి మధ్యలో వున్నాం మనం..!!

చిన్ని said...

వీళ్ళేం చేస్తున్నారో
వీళ్ళకు తెలియదు కనక
విశ్వ నరుడా !
వీళ్ళను క్షమించు
రాలింది రాతి ముక్క మాత్రమే
బాధ పడకు జాషువా !
బంగారు విగ్రహం పెట్టే రోజొస్తుంది--true